జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో మోపిదేవి

  • త్వరలో టీడీపీ గూటికి చేరనున్న వైసీపీ ఎంపీ
  • వైసీపీ బాపట్ల నియోజకవర్గం ఇంఛార్జిగా ఉన్న రాజ్యసభ ఎంపీ
  • జగన్ కు అత్యంత సన్నిహితుడి నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రాజీనామా చేసి కొంతమంది టీడీపీలో చేరుతున్నారు. ఇటీవలే గుంటూరు నియోజకవర్గం నుంచి ఇద్దరు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు, బాపట్ల నియోజకవర్గం ఇంఛార్జి మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీని వీడనున్నట్లు సమాచారం.

వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మోపిదేవి పార్టీని వీడనున్నారనే వార్తలతో పార్టీ శ్రేణులు షాక్ కు గురవుతున్నాయి. ఆయన త్వరలో టీడీపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

వైసీపీలో అంతర్గత విభేదాల కారణంగానే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా మోపిదేవి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

MP Mopidevi
YSRCP
Mopidevi Resign
YS Jagan
TDP

More Telugu News